Monday, October 25, 2010

డిజిపి వాఖ్యలపై ఓయు విద్యార్థుల ఆగ్రహం


తెలంగాణపై అమానుష వాఖ్యలు చేశారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు డిజిపి అరవిందరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణపై ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీసు అధికారి మాట్లాడవలసిన మాటలు ఆయన మాట్లాడలేదని వారు ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో నక్సలైట్లు పుట్టుకు వస్తున్నారన్న ఆయన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిజిపి అరవిందరావు ఆదివారం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పేరిట నక్సలైట్ల కదలికలు పెరుగుతున్నాయా అనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. ఉద్యమాన్ని అవకాశంగా తీసుకొని నక్సలైట్లు రాజకీయాల్లోకి వస్తే పట్టించుకోమని, కానీ ఆ పేరుతో నక్సలిజాన్ని బలోపేతం చేసి హింసవైపు పయనించాలని చూస్తే పోలీసు శాఖ అప్రమత్తంగానే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమమని, దాన్ని అణిచివేయటం మా ఉద్యోగం కాదని, శాంతిభద్రతలు రక్షించటం మా ఉద్యోగమని వాఖ్యానించారు. ఉద్యమం చేసేటప్పుడు ఇతర పార్టీల విషయంలో ఎలా వ్యవహరిస్తామో ఇప్పుడు అలానే వ్యవహరిస్తామన్నారు. ఈ మాటలపై ఓయు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.